INDIA, ODISHA: డిజిటల్ యుగంలోనూ అనాగరిక ఘటనలు కొన్ని అప్పుడప్పుడు బయటకు వస్తుంటాయి. వాటి గురించి తెలిసినప్పుడు నోట మాట రాదు. ఇప్పుడు అలాంటి ఉదంతమే ఒకటి ఒడిశాలో చోటు చేసుకుంది. వేరే కులానికి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకున్న యువతి కుటుంబ సభ్యులు.. బంధువులు 40 మందిని గ్రామం నుంచి వెలి వేశారు. దానికి బదులుగా మరేదైనా శిక్ష వేయాలని కోరగా.. గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయం షాకింగ్ గా మారింది. అసలేం జరిగిందంటే..
ఒడిశాలోని రాయగడ జిల్లా కాశీపూర్ సమితి పరిధిలోని గోరఖ్ పూర్ పంచాయితీ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి.. షెడ్యూల్ కులానికి చెందిన యువకుడ్ని ప్రేమించింది. ఇరువురు కలిసి జీవించాలని నిర్ణయానికి వచ్చారు. అయితే.. యువతి తరఫు వారు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇంట్లో వారిని ఎదిరించి మూడు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు.
వివాహం అనంతరం కొత్త జంట ఊరికి వచ్చారు. దీంతో గ్రామానికి చెందిన పెద్దలు వారి పెళ్లిపై అభ్యంతరం వ్యక్తం చేయటంతో పాటు. గ్రామ కట్టుబాట్ల ప్రకారం యువతి కుటుంబ సభ్యుల్ని వెలి వేశారు. వీరిలో యువతి కుటుంబ సభ్యులతో పాటు దగ్గరి బంధువులు నలభై మంది ఉన్నారు. అయితే.. ఈ పెళ్లి తమకు ఇష్టం లేదని.. తాము ఒప్పుకోలేదని వారు చెప్పారు.
దీంతో.. వెలిని తప్పించుకోవాలంటే అందుకు శిక్షగా శిరోముండనం చేసుకోవటం.. మూగ జీవాల్ని బలి ఇవ్వటం.. కొత్త జంటకు పెద్దకర్మ చేయాలని ఆదేశించారు. దీంతో యువతి కుటుంబ సభ్యులు.. బంధువుల్లో 40 మంది పురుషులు శిరోముండనం చేయించుకొని మేక.. గొర్రె.. కోడి.. పావురాల్ని బలి ఇచ్చారు. ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదే విషయంపై పోలీసుల్ని సమాచారం కోరగా.. తమకు దీనికి సంబంధించి ఏమీ తెలీదని చెప్పటం గమనార్హం.
Social Plugin