Hot Posts

6/recent/ticker-posts

జంపింగ్ రాయుళ్ళకు టీడీపీ షాక్


ANDRAPRADESH: తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. పార్టీ పరంగా ఏమేమి చేయాలో అన్నీ చేస్తోంది. గతంలో టీడీపీ అంటే ఎవరైనా ఎపుడైనా సులువుగా చేరిపోయేవారు. ఇక మీదట అలా కాదు అని పార్టీ ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం టీడీపీలో ఎవరు చేరాలన్నా లోకల్ లీడర్స్ నుంచి జిల్లా యంత్రాంగాల నుంచి సదరు నేత వివరాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించాలి. ఆ మీదట పార్టీ కేంద్ర పెద్దలు అన్నీ పరిశీలించి ఆ నేత యోగ్యతలను చూసి మరీ అపుడే గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అంటే ఒక విధంగా సదరు జంపింగ్ నేత బయోడేటాను పూర్తి స్థాయిలో స్కాన్ చేస్తారన మాట. ఒకవేళ కేంద్ర పెద్దల రిపోర్టులో సదరు నేతకు వ్యతిరేకంగా వస్తే ఇక పసుపు పార్టీలో చేర్చుకునే సమస్యే ఉండదని అంటున్నారు. ఆ విధంగా టీడీపీలో చేరబోయే వారికి గేట్లు చెప్పకుండానే క్లోజ్ చేస్తున్నారు అని అంటున్నారు. 


టీడీపీలో ఇటీవల కాలంలో కోవర్టుల బెడద ఎక్కువ అయింది అని ప్రచారం సాగుతోంది. ఇక్కడ మాటలు అక్కడ చెబుతున్న వారు అధికం అయ్యారు. వైసీపీకి టీడీపీ మ్యాటర్స్ చేరిపోతున్నాయన్న అనుమానాలు కూడా ఉన్నాయట. అందుకే చంద్రబాబు ఈ మధ్య కడపలో జరిగిన మహానాడు సభలో వలస పక్షులు అన్న మాట వాడారు. వారు వస్తారు పోతారు పార్టీ క్యాడరే శాశ్వతం అని కూడా అన్నారు. అంతే కాదు వారు పార్టీలో చేరి వర్గ విభెదాలను పెంచి ఒకే పార్టీలో గొడవలకు కారణంగా మారుతున్నారని అవి ఒక దశలో హత్యలకు కూడా దారి తీస్తున్నాయని కూడా పార్టీ పెద్దలు అనుమానిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇతర పార్టీలలో వచ్చిన వారిని వచ్చినట్లే చేర్చుకునే విధానానికి పార్టీ పూర్తిగా స్వస్తి పలికింది. 

నిజానికి చూస్తే టీడీపీ చాలా మంది ఇతర పార్టీ నేతలను చేర్చుకుంది. ఎన్టీఆర్ సమయంలో అయితే తక్కువగా ఉండేది. చంద్రబాబు చేతిలోకి పార్టీ పగ్గాలు వచ్చాక మాత్రం ఇతర పార్టీ వారి మీద గురి పెట్టి చేర్చుకోవడం అధికం అయింది. దానిని ఒక వ్యూహంగా చంద్రబాబు అమలు చేశారు. ప్రత్యర్థి పార్టీని వీక్ చేయాలన్న ఉద్దేశ్యంతోనే ఆయన ఇదంతా చేశారు. ఇక 2014 నుంచి 2019 మధ్యలో అటు కాంగ్రెస్ ఇటు వైసీపీ నుంచి ఎంతో మంది నేతలను టీడీపీలోకి తీసుకున్నారు. వైసీపీ నుంచి అలా 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుని వారిలో కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అయితే ఇంత చేసినా టీడీపీకి కొత్తగా వచ్చిన లాభం కంటే రాజకీయ నష్టమే ఎక్కువగా జరిగింది. 

దాంతో 2019 ఎన్నికల్లో ప్రతీ నియోజకవర్గంలో వర్గ పోరు పెరిగింది. అలా పార్టీ ఓటమికి అది దారి తీసింది. ఇక 2024 ఎన్నికల ముందు కూడా చాలా మంది వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. ఆ విధంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి ఇపుడు ప్రతీ నియోజకవర్గంలో కనీసంగా ముగ్గురు నలుగురు గట్టి నేతలు ఉన్నారు. ఇలా ఉండడం వల్ల వర్గ పోరు పెరుగుతోంది అని అంటున్నారు. అంతే కాదు వైసీపీ నుంచి వచ్చిన వారు కోటరీగా మారి అధికారాన్ని అనుభవిస్తున్నారు వైసీపీని బలహీనపరచే చర్యలను కూడా కొందరు చేస్తున్నారు అని అంటున్నారు. దీంతో వీటికి చెక్ చెప్పాలని టీడీపీ హైకమాండ్ భావిస్తోంది. అందుకే ఇక మీదట టీడీపీలో చేరికలు అంత సులువు కాదని అంటున్నారు. 

జంపింగ్ జఫాంగులకు ఇది చేదు వార్తగానే ఉంటుంది. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ చేరి ఆ పవర్ పోగానే తాము పలాయనం చిత్తగించే వలస పక్షూకు పూర్తిగా తలుపులు మూసేస్తూ టీడీపీ ఈ విధంగా చర్యలు తీసుకుంది అని అంటున్నారు. దీని వల్ల పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి పదవులు వస్తాయని అలాగే పార్టీ కూడా పది కాలల పాటు క్షేమంగా ఉంటుందని పెద్దలు ఆలోచించే ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. సో సైకిలెక్కాలనుకుంటే శీల పరీక్షలకు ఎన్నింటికో గురి కాక తప్పదని అంటున్నారు.