TELANGANA, ANDRAPRADESH: మన దేశంలో కోర్టు కేసులు దశాబ్దాల తరబడి సాగుతుంటాయి. ముఖ్యంగా రాజకీయ నాయకుల పాత్ర ఉన్న కేసుల్లో ఇక చెప్పనక్కరలేదు. నిందితులుగా ఉన్నవారిలో కొందరు స్వర్గలోకానికి వెళ్లిపోతారు. కొందరు పదవులు సంపాదించుకొని అందలం ఎక్కుతారు. వారి పదవీ కాలం కాగానే దిగిపోతారు కూడా. అయినా ఆ కేసులు ఓ పట్టాన తెగవు. ముడిపడవు. నిందితులుగా ఉన్న రాజకీయ నాయకులు దోషులా? నిర్దోషులా? కోర్టులు తేల్చవు. ‘అంతులేని కథ’ అన్న సినిమా మాదిరిగా ఆ కథ అలా సాగుతూనే ఉంటుంది. అది ఎప్పుడు కంచికి చేరుకుంటుందో తెలియదు.
ఆధారాలు ఉన్నాయని దర్యాప్తు సంస్థలే చెబుతాయి. అయిన్పటికీ కేసు ఏళ్ల తరబడి కోర్టుల్లో మగ్గతూనే ఉంటుంది. ఇది చెప్పకునేది ఎందుకంటే…తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిందితుడిగా ఉన్న ‘ఓటుకు నోటు’ కేసుకు ఈరోజుతో పదేళ్లు నిండాయి. అంటే దశాబ్దం గడిచిపోయింది. కాని దానికి మోక్షం కలగలేదు. ఈ కేసులోనే ఆయన కొన్నిరోజులు జైలుకు కూడా వెళ్లాడు. అప్పుడు ఆయన టీడీపీ నాయకుడు. అప్పట్లో సీఎంగా ఉన్న కేసీఆర్ చంద్రబాబును, రేవంత్ను ఉద్దేశించి ’మిమ్మల్ని హరిహరాదులు కూడా రక్షించలేరు’ అన్నాడు కేసీఆర్.
కాని వాళ్లిదరు చక్కగా ముఖ్యమంత్రి పదవుల్లో ఉన్నారు. కేసీఆరే ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ కేసు సంగతి తెలిసిందే కదా. జనం దాన్ని ఇప్పుడు మర్చిపోయి కూడా ఉంటారు. 2015 జూన్ 1న జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా ఓటు వేసేందుకు ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్ సన్ కు రేవంత్ రూ.50 లక్షలు లంచం ఇస్తూ పట్టుబడ్డాడు. ఆ సమయంలో రేవంత్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు.
ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిపై మనీలాండరింగ్, రూ.50 లక్షల అక్రమాలకు పాల్పడినట్లు చెప్పిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అందుకు ఆధారాలు ఉన్నాయని చెప్పింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద దాఖలు చేసిన చార్జిషీట్లో రేవంత్ రెడ్డిని 1వ నిందితుడిగా పేర్కొన్న ఈడీ అధికారులు 2019లో విచారణ సమయంలో ఆయన తప్పించుకున్నాడని తెలిపారు. 2018లో ఈ వ్యవహారంపై ఈడీ దర్యాప్తు ప్రారంభించి, ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న ఎల్విస్ స్టీఫెన్ సన్, ఇతరుల వాంగ్మూలాలను నమోదు చేసింది. అదే ఏడాది రేవంత్ కాంగ్రెస్ లో చేరాడు.
2023 డిసెంబర్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయన ముఖ్యమంత్రి నిందితుడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు. ఈ కేసులో 2021 జూలై 25న చార్జిషీట్ దాఖలు చేసిన దర్యాప్తు ఏజెన్సీ రేవంత్ రెడ్డితో పాటు మరో నలుగురిపై అభియోగాలు నమోదు చేసింది. ఇందులో రేవంత్ను ప్రధాన నిందితుడిగా పేర్కొంది. పీఎంఎల్ ఏ సెక్షన్ 50 కింద నమోదు చేసిన వాంగ్మూలంలో ఎల్విస్ స్టీఫెన్ సన్ ను కలిసి వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ లో ఓటు వేసేలా ఒప్పించాలని రేవంత్ రెడ్డి చెప్పినట్లు మత్తయ్య జెరూసలెం (నిందితుల్లో ఒకరు) ధ్రువీకరించాడు.
ఎల్విస్ స్టీఫెన్ సన్ టీడీపీ ఎమ్మెల్సీకి అనుకూలంగా ఓటు వేస్తే రూ.5 కోట్లు ఇస్తామని, ఎల్విస్ స్టీఫెన్ సన్ ఓటింగ్ కు గైర్హాజరైతే రూ.3 కోట్లు ఇస్తామని, జెరూసలేం వెళ్లేందుకు విమాన టికెట్ తో పాటు రూ.3 కోట్లు ఇస్తామని రేవంత్ రెడ్డి తనతో చెప్పారని ఒక ఈడీ అధికారి చెప్పారు. 2019 ఫిబ్రవరిలో ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ రేవంత్ రెడ్డిని ప్రశ్నించింది. రుద్ర ఉదయ్ సింహా అనే వ్యక్తితో తాను కొన్ని అంశాలపై చర్చిస్తుండగా కొందరు పోలీసులు బలవంతంగా సమీపంలోని అపార్ట్ మెంట్ కు తీసుకెళ్లారని తప్పుడు వాంగ్మూలం ఇచ్చారని ఈడీ ఆరోపించింది.
అయితే, రేవంత్ రెడ్డి గన్ మెన్లు తమ వాంగ్మూలంలో రేవంత్ రెడ్డికి అలాంటిదేమీ జరగలేదని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో రికార్డింగ్ ను రేవంత్ రెడ్డికి చూపించారని, అందులో అతను డబ్బును ఎల్విస్ స్టీఫెన్ సన్ కు ఇవ్వడం స్పష్టంగా కనిపించిందని మరో అధికారి తెలిపారు. అయితే, రేవంత్ రెడ్డి తన సమాధానంలో ‘ఒక వ్యక్తి నాలాగే కనిపిస్తున్నాడు’ అని చెప్పాడని ఈడీ తెలిపింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద నమోదైన అభియోగాల దర్యాప్తులో రేవంత్ రెడ్డి నేరుగా ఓటుకు నోటుకు సంబంధించిన నేరంలో పాలుపంచుకున్నాడని, పీఎంఎల్ ఏ సెక్షన్ 4 ప్రకారం మనీ లాండరింగ్ నేరానికి పాల్పడ్డారని తేలింది.
ఫిర్యాదుదారుడు ఒక నిర్దిష్ట అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయమని ప్రేరేపించడం పిఎంఎల్ఏ ప్రకారం నేరమేనని, తద్వారా మనీలాండరింగ్ నేరానికి పాల్పడ్డాడు” అని ఈడీ తెలిపింది. ఆ తరువాత ఈ కేసు సుప్రీం కోర్టుకు వెళ్లింది. ముఖ్యంగా సీఎం రేవంత్రెడ్డి ఓటుకు నోటు కేసుతో సంబంధం ఉన్న వారందరికీ జాబ్ గ్యారంటీ అంటూ ఒక్కో పదవిలో కూర్చోబెట్టాడు. ఆ కేసులో డబ్బు సంచులతో కెమెరాకు చిక్కిన సీఎం రేవంత్ ముఖ్య అనుచరుడు రుద్ర ఉదయ సింహాకు ఢిల్లీలో ఓ పదవి ఇచ్చాడు.
ఓటుకు నోటు కేసుతో సంబంధమున్న ప్రతి ఒక్కరూ ప్రస్తుతం ఏదో ఒక పదవిలో ఉన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రేవంత్రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరూ చెరో రాష్ట్రానికి సీఎంలు అయ్యారు. ఇక రేవంత్ చిరకాల స్నేహితుడు. ఓటుకు నోటు కేసుకు మూలమైన వ్యక్తులలో ఒకడైన వేం నరేందర్ రెడ్డి కేబినెట్ హోదాలో ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారుగా ఉన్నాడు.
ఇక ఇదే కేసులో న్యాయవాదిగా ఉన్న డెవీనా సెహగల్ కూడా ఓ పదవి దక్కించుకున్నాడు. సుప్రీం కోర్టులో తెలంగాణ కౌన్సిల్ న్యాయవాదిగా నియమితులయ్యాడు. ఇక రేవంత్రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న రుద్ర ఉదయ సింహా ఢిల్లీలో సీఎం పీఆర్వోగా బాధ్యతలు స్వీకరించాడు. రేవంత్ రెడ్డి బ్యాగులో నుంచి డబ్బు కట్టలు తీసి స్టీఫెన్సన్కు ఇస్తున్న వీడియో అప్పట్లో టీవీ ఛానెళ్లలో అదే పనిగా ప్రసారమైంది.
Social Plugin