Hot Posts

6/recent/ticker-posts

కూకట్‌పల్లిలో రూ. 2 కోట్ల విలువైన డ్రగ్స్‌తో ముఠా అరెస్ట్.. ఆంధ్రా కానిస్టేబుల్ హస్తం


TELAMGANA: హైదరాబాద్‌ నగరం మళ్లీ డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మారుతున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల కూకట్‌పల్లిలో జరిగిన పోలీసుల మెరుపు దాడుల్లో భారీగా మత్తు పదార్థాలు పట్టుబడి నగరాన్ని కుదిపేసింది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, డ్రగ్స్ సరఫరాలో దూకుడు చూపుతున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. విచారణలో అరెస్టైన వారంతా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా అద్దంకి ప్రాంతానికి చెందినవారుగా గుర్తించారు. ఈ కేసులో తిరుపతికి చెందిన ఓ కానిస్టేబుల్ కూడా ముఠాతో సంబంధాలు కలిగి ఉండటంతో అతను ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. 


అరెస్టుల్లో ఉన్న వ్యక్తుల వద్ద నుంచి దాదాపు 800 గ్రాముల హెరాయిన్, ఎపిడ్రిన్ మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ ముఠాలో పోలీస్ సిబ్బంది కూడా కలిసిపోవడం అధికారులను ఆందోళనకు గురి చేసింది. పరారీలో ఉన్న కానిస్టేబుల్ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు మే 30న సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని షాద్‌నగర్‌లో ఉన్న ఓ దాబా వద్ద నిర్వహించిన తనిఖీలో ఒకటిన్నర కిలోల హెరాయిన్‌తో పాటు గంజాయి, ఓపీఎం వంటి ఇతర మత్తు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్వోటీ పోలీసులు తెలిపారు. పట్టుబడిన డ్రగ్స్ మార్కెట్ విలువ రూ. 3 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా. 

- డ్రగ్ ఫ్రీ తెలంగాణ లక్ష్యం 
ఈ వరుస ఘటనల మధ్య సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంగా తీసుకున్న నిశ్చయాన్ని మరింత బలంగా అమలు చేస్తూ, మత్తు పదార్థాల పై ఉక్కు పాదం మోపాలని ఆదేశించారు. యువతను మత్తు పదార్థాల నుంచి రక్షించేందుకు పోలీసులు నగరమంతా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నిషేధించిన మత్తు పదార్థాల విక్రయంపై, నేరంగా భాగస్వాములైన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. 

పోలీసులు యువత, తల్లిదండ్రులకు హెచ్చరికలు జారీ చేస్తూ డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. హైదరాబాద్‌ను డ్రగ్ స్మగ్లింగ్ కేంద్రంగా మలచే ప్రయత్నాలను ప్రభుత్వం, పోలీసులు సమూలంగా అణచివేయాలని నిశ్చయించారు. ఒకవైపు పోలీసులు దాడులు జరుపుతూ నేరగాళ్లను పట్టుకుంటుండగా, మరోవైపు ముఠాలు నిత్యం మారు మారు రూపాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వ దృష్టిలో ఇప్పుడు ఇదొక అత్యవసర సమస్యగా మారింది. ఇలాంటి దందాలకు సమూలంగా తెరదించాలంటే ప్రజల సహకారం, సమాచారాన్ని పంచుకోవడం కీలకం.