ఆంధ్రప్రదేశ్, అమరావతి: ఇక విపక్షం ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజును వెన్నుపోటు దినంగా పాటిస్తే.. మాజీ ముఖ్యమంత్రి జగన్ కే వెన్నుపోటులో పేటెంట్ హక్కు ఉందని షర్మిల ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వం, విపక్ష వైసీపీపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన ట్వీట్ ద్వారా రెండు పక్షాలను ఒకేసారి ఉతికి ఆరేశారు.
ఏడాది క్రితం ఉన్మాద, అవినీతి, అరాచక పాలనకు గుణపాఠం చెప్పి, కూటమి పార్టీలకు పట్టం కడితే ప్రజా విప్లవానికి వక్రభాష్యం చెప్పేలా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన కొనసాగుతోందని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను వంచించారని, అందుకే ఈ రోజును ప్రజా వంచన దినోత్సవంగా పాటించాలని షర్మిల ట్వీట్ చేశారు.
ఇక విపక్షం ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజును వెన్నుపోటు దినంగా పాటిస్తే.. మాజీ ముఖ్యమంత్రి జగన్ కే వెన్నుపోటులో పేటెంట్ హక్కు ఉందని షర్మిల ట్వీట్ చేశారు. ఒక ట్వీట్ లోనే ఇటు ప్రభుత్వం.. అటు విపక్షంపై షర్మిల విరుచుకుపడటం ఆసక్తికరంగా మారింది. కూటమి ఏడాది పాలనలో ప్రతి అంశాన్ని టచ్ చేసిన షర్మిల.. అదే సమయంలో విపక్ష పాత్రలో జగన్ విఫలమయ్యారని ధ్వజమెత్తారు.
‘‘ ఉన్మాద, అవినీతి, అరాచక పాలనకు గుణపాఠం చెప్పి, ఏడాది క్రితం ఇదే రోజు కూటమి పార్టీలకు పట్టం కడితే, ప్రజా విప్లవానికి, ఇచ్చిన తీర్పునకు వక్రభాష్యం చెప్పేలా చంద్రబాబు ఏడాది పాలన ఉంది. పునర్ నిర్మాణం పేరుతో సంవత్సరం పాటు కాలయాపన చేశారు. గాడిన పెడుతున్నాం అని చెవుల్లో క్యాలీఫ్లవర్లు పెట్టారు. సూపర్ సిక్స్ హామీలను గాలి కొదిలేశారు. అప్పుల సాకు చూపి అభివృద్ధిని అటకెక్కించారు. నిధులు లేవని ప్రజా సంక్షేమానికి పంగనామాలు పెట్టారు. కరెంటు బిల్లుల పేరిట జనాల జేబులకు చిల్లులు పెట్టారు.’’ అంటూ విమర్శలు గుప్పించారు.
అదే సమయంలో విభజన హామీలకు దిక్కులేదని, ప్రత్యేక హోదా అడగలేదని ఆరోపించారు. పోలవరం ఎత్తు తగ్గించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తుంటే కనీసం నోరు విప్పలేదని ముఖ్యమంత్రి చంద్రబాబును తప్పుపట్టారు. విశాఖ స్టీల్ ప్లాంటును ఉద్ధరిస్తామని చెప్పి, 4 వేల మంది కార్మికుల ఉద్యోగాలు తొలగించారని, వక్ఫ్ బిల్లుకు మద్దతు పలికి ముస్లింలకు తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలా ఏడాది పాటు కాలయాపన చేసినందుకు గాను ప్రభుత్వం చెబుతున్న ప్రజా తీర్పు దినంను తమ పార్టీ "ఆంధ్రప్రదేశ్ ప్రజా వంచన దినం"గా పాటిస్తుందని ప్రకటించారు. నమ్మకం పేరుతో ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ రాష్ట్ర ప్రజలను వంచించారని నిరసన వ్యక్తం చేశారు షర్మిల.
ఇక ఇదే ట్వీట్ లో విపక్ష నేత వైఎస్ జగన్ పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు షర్మిల. ప్రతిపక్షం వైసీపీ పిలుపునిచ్చిన “వెన్నుపోటు”దినానికి అర్థమే లేదన్నారు. రక్త సంబంధాన్ని అడ్డుపెట్టుకొని అవసరాలకు, పాదయాత్రలకు వాడుకున్నారని గతంలో తన పట్ల వ్యవహరించిన వైఖరిని గుర్తు చేశారు. వెన్నుపోటు అనే పదానికి పేటెంట్ రైట్స్, బ్రాండ్ అంబాసిడర్ ఎవరో రాష్ట్ర ప్రజలకు అంతా తెలుసు.
ఏడాది కాలంగా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తుంటే, ప్రజల పక్షాన ప్రశ్నించేందుకు అసెంబ్లీకి వెళ్లకుండా, కూటమి హామీలపై గళం విప్పకుండా, ప్రతిపక్ష హోదా కావాలని, ఇంట్లో ప్రెస్ మీట్ లు పెట్టీ మారం చేస్తున్నారని వైసీపీ అధినేత జగన్ పై సెటైర్లు వేశారు. నిజమైన వెన్నుపోటు దారుడే జగనే అంటూ విమర్శించారు.
‘‘ప్రజా సమస్యల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, లిక్కర్ స్కాం ఆగురించిద్యుడు మీరే అని కూటమి దర్యాప్తు చేస్తుంటే, ఆన్ లైన్ లో కాకుండా క్యాష్ పద్ధతిలో లిక్కర్ సొమ్ము అసెంబ్లీ సాక్షిగా విచారణకు సిద్ధం అని చెప్పే దమ్ము లేకుండా నిరసనలు చేస్తుంటే దొంగే దొంగ అని అరిచినట్లుంది.’’ అని పోస్టు చేశారు.
Social Plugin