Hot Posts

6/recent/ticker-posts

'జైల్లో ఉండగనే ఉగ్రవాది తండ్రి అయ్యాడు'.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు!


TELANGAN,  హైదరాబాద్: ఉగ్రవాదులకు అనుకూలంగా పాకిస్థాన్ అనుసరిస్తోన్న వైఖరిని ఎండగట్టడంతోపాటు ఆపరేషన్ సిందూరు గురించి వివరించడానికి విదేశాలకు వెళ్లిన భారత అఖిలపక్ష ప్రతినిధుల బృందంలో భాగమైన ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహోదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. అల్జీరియాలో పాకిస్థాన్ పై విరుచుకుపడ్డారు.


ప్రస్తుతం విదేశాల్లో పర్యటిస్తున్న భారత అఖిలపక్ష ప్రతినిధుల బృందంలో సభ్యుడైన అసదుద్దీన్ ఒవైసీ.. ఉగ్రవాదులపై పాకిస్థాన్ అనుసరిస్తోన్న అనుకూల వైఖరిపై మండిపడ్డారు. ఇందులో భాగంగా... 26/11 ముంబై దాడుల సూత్రధారి జకీర్ రెహ్మాన్ లఖ్వీ జైల్లో ఉన్నప్పుడు అతనికి పాకిస్థాన్ ప్రత్యేక మర్యాదలు అందించిందని చెబుతూ.. ఓ కీలక విషయం వెల్లడించారు.

ఇందులో భాగంగా... జకీర్ రెహ్మాన్ లఖ్వీ అనే ఒక ఉగ్రవాది ఉన్నాడు.. తీవ్రమైన ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉగ్రవాదిని జైలు నుంచి బయట ప్రపంచంలోకి రావడానికి ఏ దేశమూ అనుమతించదు కానీ.. అతడు జైల్లో ఉండగానే ఒక కొడుకుకు తండ్రి అయ్యాడు. ఆ స్థాయిలో పాకిస్థాన్ ఉగ్రవాదులకు అనుమతులు ఇస్తుంది అంటూ ఒవైసీ మండిపడ్డారు.

ఇదే సమయంలో.. పాకిస్థాన్ తన రెక్కలను విచ్చుకునే ప్రయత్నంలో ఉందని.. అందువల్ల ఆ దేశాన్ని తిరిగి గ్రే లిస్ట్ లో ఉంచాలని ఈ సందర్భంగా ఒవైసీ ప్రపంచ సమాజాన్ని, ఉగ్రవాద వ్యతిరేక ఆర్థిక సంస్థను కోరారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు అమాయక ప్రజలను చంపడం ద్వారా ఇస్లాం సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఎత్తి చూపారు.

ఈ సందర్భంగా ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది మరణించిన విషయాన్ని ప్రస్థావించిన ఒవైసీ... ఈ ఘటనలో హిందూ పురుషులను ఏరిమరీ చంపారని అన్నారు! వాస్తవానికి ఇస్లాం ఏ వ్యక్తినీ చంపడానికి అనుమతించదని.. అయితే, దురదృష్టవశాత్తు చంపడం వారి భావజాలం అయ్యిందని.. ఒవైసీ మండిపడ్డారు.

ఈ సందర్భంగా ఉగ్రవాదులను స్పాన్సర్ చేస్తున్న పాకిస్థాన్ ను అదుపులో పెట్టాలని ఒవైసీ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఇది భారతదేశ సమస్య మాత్రమే కాదని.. మొత్తం దక్షిణాసియా ప్రాంతానికి ముప్పుగా పరిణమించిందని అన్నారు. ఉగ్రవాదానికి ప్రధాన స్పాన్సర్ గా ఉన్న పాక్ ను నియంత్రించడం ప్రపంచ శాంతికి మంచిదని ఆయన తెలిపారు.