తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చక పోవడం క్రిమినల్ చర్య కిందకు రాదని హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. వివాహ హామీని ఉల్లంఘించినందుకు నిందితుడిపై మోసం కేసును కొనసాగించలేమని స్పష్టం చేసింది. అయితే పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చేటప్పుడే.. మోసం చేయాలనే ఉద్దేశం ఉందని తేలితే.. అది నేరమే అవుతుంది. అది నిరూపించాల్సిన బాధ్యత బాధితులకు ఉంటుంది. స్పష్టమైన ఆధారాలు ఉండాలి. అప్పుడే దాన్ని నేరంగా పరిగణిస్తారని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. హైదరాబాద్ లోని కర్మన్ ఘాట్ కు చెందిన రాజాపురం జీవన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను విచారిస్తూ హైకోర్టు ఈ తీర్పును వెల్లడించింది.
కర్మన్ ఘాట్ కు చెందిన రాజాపురం జీవన్ రెడ్డి అనే వ్యక్తి.. తన తల్లిదండ్రుల సమ్మతితో పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. అనంతరం మాట తప్పాడని కరకల్ల పద్మినీరెడ్డి ఫిర్యాదు నేపథ్యంలో 2019లో తనపై నమోదు చేసిన క్రిమినల్ కేసును సవాల్ చేస్తూ జీవన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును జస్టిస్ ఎన్. తుకారాంజీ విచారణ జరిపారు. పెళ్లి హామీ ఉల్లంఘనను క్రిమినల్ మోసం కింద పరిగణించలేమని తీర్పు చెప్పిన కోర్టు, ఈ కేసును కొట్టివేసింది.
Social Plugin