ANDRAPRADESH: ఈ కాలానికి రాజకీయంగా అదృష్టవంతుడు ఫైబర్నెట్ మాజీ చైర్మన్, టీడీపీ మాజీ నేత జీవీరెడ్డి. ఈ విషయాన్ని వివిధ కార్పొరేషన్ పదవులు దక్కించుకున్న టీడీపీ నాయకులే అంటుండడం విశేషం. ఎందుకంటే కార్పొరేషన్, నామినేటెడ్ పదవులన్నీ కేవలం అలంకారప్రాయంగా తయారయ్యాయని, ఎలాంటి బడ్జెట్ కేటాయింపులు లేవని లబోదిబోమంటున్నారు. మంత్రులకే పవర్స్ లేవని, ఇక తామెంత? అని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి నామినేటెడ్ పోస్టుల్లో ఫైబర్నెట్ చైర్మన్ పదవి కీలకమైంది. ఆర్థిక వనరులున్న సంస్థ అది. అలాంటి పదవి దక్కించుకున్న జీవీరెడ్డికి తిక్కరేగి, అకస్మాత్తుగా పదవికి రాజీనామా చేశారు. కనీసం రెండు నెలలు కూడా ఫైబర్నెట్ చైర్మన్గా జీవీరెడ్డి కొనసాగలేకపోయారు. నాడు జీవీరెడ్డిని చాలా మంది వెర్రిబాగులోడిగా చూశారు. పదవిని అడ్డు పెట్టుకుని, పది రూపాయిలు వెనకేసుకోకుండా, ఇదేం తిక్క చేష్ట అని అభిమానంతో తిట్టినోళ్లున్నారు.
కానీ కళ్లెదుటే అవినీతిని, దోపిడీని చూస్తూ ఊరికే వుండలేనని జీవీరెడ్డి బహిరంగంగా కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత, ఈ ప్రభుత్వం చెబుతున్నదొకటి, జరుగుతున్నదొకటి అని భావించి, పదవి నుంచి తప్పుకోవడమే గౌరవప్రదమని భావించారు. మనస్సాక్షికి విరుద్ధంగా పని చేయలేనని పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడాయన లాయర్గా బిజీ అయ్యారని తెలిసింది.
ఇదే సందర్భంలో పదవులు దక్కించుకున్నోళ్లలో ఆనందం ఏమైనా వుందా? అంటే… అబ్బే అలాంటిదేమీ లేదని ఎక్కువ మంది చెబుతున్న మాట. ఐదారుగురు మినహాయిస్తే, మరెవరికీ ఆర్థికపరమైన వెసులుబాటు కల్పించలేదని వాపోతున్నారు. మరోవైపు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత. ప్రజాప్రతినిధుల దోపిడీ. ఈ ప్రభుత్వంలో పవర్స్ లేని పదవులు పొంది, పాపాల్లో మాత్రం భాగస్వామలవుతున్నామనే ఆలోచన వెంటాడుతున్నట్టు కొందరు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒక రకంగా చూస్తే… జీవీరెడ్డి ఈ పాప పంకిలం నుంచి ముందే తప్పించుకుని అదృష్టవంతుడయ్యాడని వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు అంటున్నారు.
Social Plugin