ANDRAPRADESH: అధికారం దక్కించుకోవాలన్న చంద్రబాబు ఆశయం నెరవేరింది. అపరిమితమైన అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలకు ఆయన ప్రభుత్వం రుణపడింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పింఛన్ రూ.4 వేలకు పెంచడంతో పాటు అరియర్స్ కూడా ఇస్తామన్న మాట నిలబెట్టుకుంది. ఇంత వరకూ ప్రభుత్వాన్ని తప్పక అభినందించాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ విషయమై ప్రజల్ని భయపెట్టి, కూటమి రాజకీయంగా సొమ్ము చేసుకుందనే విమర్శను కొట్టి పారేయలేం.
మెగా డీఎస్సీ ఫైల్పై సీఎంగా చంద్రబాబు మొదటి సంతకం చేసినప్పటికీ, నోటిఫికేషన్ రావడానికి 11 నెలల సమయం పట్టింది. మరోవైపు డీఎస్సీపై రకరకాల అభ్యంతరాలు. అభ్యర్థులది అరణ్య రోదనైంది. దీంతో మెగా డీఎస్సీ నిర్వహణతో, నిరుద్యోగ ఉపాధ్యాయుల ఆదరణ కంటే, పెద్దసంఖ్యలో ఉన్న వాళ్ల కుటుంబ సభ్యుల వ్యతిరేకతను ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అలాగే తల్లికి వందన, అన్నదాత సుఖీభ, అలాగే మహిళలకు ప్రతినెలా రూ.1500 చొప్పున ఇస్తామన్న హామీ… ఇలా ఒక్కటేమిటి, ఎన్ని పథకాల్ని అమలు చేశారో ప్రభుత్వ పెద్దలే చెప్పాలి.
ఏడాదికి మూడు సిలిండర్లలోనూ వెన్నుపోటే. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదికంతటికీ ఒకే ఒక్క సిలిండర్తో సరిపెట్టడాన్ని ఏమని పిలుస్తారో పాలకులే సెలవిస్తే బాగుంటుందని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఇదేమని ఎవరైనా ప్రశ్నిస్తే, గత పాలకులు ఆర్థిక అరాచకం సృష్టించారని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని, ఖజానా ఖాళీగా ఉండడం చూస్తే భయమేస్తోందని చంద్రబాబు పదేపదే తప్పించుకునే మాటలు చెబుతున్నారని పౌర సమాజం విమర్శిస్తోంది.
జగన్ రాష్ట్రాన్ని శ్రీలంక, పాకిస్థాన్ మాదిరిగా తయారు చేశారని ఇదే కూటమి నేతలు ఎన్నికల సమయంలో ప్రచారం చేయడం ప్రజలకు ఇంకా గుర్తుంది. అప్పుడు వాస్తవాలన్నీ తెలిసే, సంపద సృష్టిస్తానని నమ్మబలికే కదా తమతో ఓట్లు వేయించుకున్నారని జనం ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు గద్దెనెక్కిన తర్వాత, ఆర్థిక ఇబ్బందుల సాకు చూపి, వెన్ను చూపాలని అనుకోవడం సరైందా? అని పౌర సమాజం నిలదీస్తోంది.
వెన్నుపోటు దినాన్ని నిర్వహిస్తున్న వైసీపీపై రాజకీయంగా ఎన్ని రకాల విమర్శలైనా ప్రత్యర్థులు చేయొచ్చు. కానీ ప్రజల మనసుల్లో ఆ భావన నాటుకుంటే, తమ భవిష్యత్ ఏంటో కూటమి నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. వెన్నుపోటును సీరియస్గా తీసుకోకుంటే, అంతిమంగా ప్రజలు ఓటు పోటు పొడుస్తారని గుర్తించుకోవాలి. ఈ పోటుకు రాజకీయ పార్టీల తలరాతలు మారిపోతాయి.
Social Plugin