ANDRAPRADESH: వైఎస్ జగన్పై కోపాన్ని, అసంతృప్తిని పారదోలి, వాళ్లందరినీ ఏకతాటిపై తీసుకొచ్చిన ఘనత మంత్రి నారా లోకేశ్ తీసుకొచ్చిన రెడ్బుక్దే. అపరిమితమైన అధికారాన్ని దక్కించుకున్న కూటమి, కేవలం పాలనపై దృష్టి సారించి, హామీల అమలు, అలాగే అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించి వుంటే, వైఎస్ జగన్ ఇప్పట్లో రాజకీయంగా కోలుకునేవారు కాదు. కానీ అధికారంలోకి వచ్చిన మొదలు వైసీపీ కార్యకర్తలు మొదలుకుని, అధినాయకుడు జగన్ వరకూ ఎలా ఇబ్బంది పెట్టాలా? అనే అంశంపైనే కూటమి నేతలు ఆలోచించారు.
చేతిలో అధికారం వుండడంతో కూటమి నేతలు చెలరేగిపోయారు. మొదట్లో వైసీపీ శ్రేణులు బెంబేలెత్తిన మాట నిజం. ఎందుకంటే, కేవలం 11 సీట్లకే పరిమితమైన తమ పార్టీ అసలు రాజకీయంగా బతుకుతుందా? అనే సంశయం వుండింది. కూటమి అరాచక పాలన పుణ్యాన, ప్రభుత్వంపై వ్యతిరేకత, వైసీపీకి ప్రజల్లో సానుకూలతగా మారుతూ వస్తోంది. ఒకవైపు ప్రత్యర్థులపై వేధింపులు, మరోవైపు ప్రకృతి వనరుల దోపిడీ.
దీంతో కూటమి కంటే వైసీపీ నాయకులే నయం అని జనం అనుకునే పరిస్థితిని చేజేతులా తెచ్చుకున్నారు. ఎంతసేపూ ప్రత్యర్థులపై ఏ కేసులు పెట్టాలా? సుదీర్ఘ కాలం పాటు జైల్లోనే ఉంచేందుకు ఏం చేయాలనే ఆలోచనలపై ఉన్న శ్రద్ధాసక్తులు… మనమిచ్చిన హామీల్ని ఎలా నెరవేర్చాలనే దానిపై పది శాతం కూడా లేకపోవడంతో ప్రజల్లో సానుకూలత క్రమంగా పోవడం మొదలైంది.
ఇదేదో కూటమికి వ్యక్తిగత కక్ష తీర్చుకోడానికి మనం అధికారం ఇచ్చినట్టైందనే భావన ప్రజల్లో పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలు వెలువడిన జూన్ 4న వెన్నుపోటు దినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలనే జగన్ పిలుపునకు, ప్రజల అసంతృప్తి తోడైంది. అందుకే వైసీపీ నాయకులే ఆశ్చర్యపోయేంతగా… కనీవినీ ఎరుగని రీతిలో వెన్నుపోటు దినం ఘన విజయం సాధించింది. ఈ సక్సెస్ కేవలం లోకేశ్ రెడ్బుక్కే దక్కుతుందని వైసీపీ నాయకులు ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నారు.
Social Plugin