ANDRAPRADESH: రాజకీయ వాతావరణం బాగు చేయలేనంత దారుణంగా కలుషితమైంది. అన్ని పార్టీల సిద్ధాంతాలు చెప్పుకోడానికి మాత్రం సమాజ ఉద్ధారణకే. అయితే ఆచరణ అందుకు పూర్తి విరుద్ధం. రోజురోజుకూ రాజకీయాల్లో విలువలు పతనమవుతున్నాయి. ఇంతకంటే దిగజారరు అని అనుకున్న ప్రతిసారీ, పాతాళానికి పడిపోతుండడం చూస్తున్నాం.
మనం నాటే విత్తనాలను బట్టే, మొక్కలు మొలకెత్తుతాయి. అవి మహా వృక్షాలవుతాయి. ప్రస్తుత రాజకీయ రంగంలో విష మొక్కలు కాస్త మహా వృక్షాలయ్యాయి. కాల గమనంలో వాటి ఫలాలే మనకు నాయకులవుతుండడం విషాదం. మన సమాజం చేసుకున్న దౌర్భాగ్యం.
ఇవాళ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం. ఈ సందర్భంగా రాజధాని అమరావతి ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, మంత్రి నారాయణ పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ వచ్చే నాలుగేళ్లలో ఐదు కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. కొన్ని దేశాల్లో చెట్లు నరికితే శాశ్వతంగా జైల్లో పెడతారన్నారు. చెట్లు నరికితే మనిషిని చంపినట్టే అని కొన్ని దేశాల్లో చట్టాలు కూడా ఉన్నాయన్నారు.
పర్యావరణ పరిరక్షణ ఎంత ముఖ్యమే, ఇతర రంగాల్ని కాపాడుకోవడం కూడా అంతే కీలకం. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న రాజకీయ రంగాన్ని వివిధ రకాల కాలుష్యబారిన పడకుండా పరిరక్షించే బాధ్యత రాజకీయ పార్టీల నేతలపై వుంది. కానీ తమ కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వహిస్తున్నామా? లేదా? అనేది చంద్రబాబు, పవన్, వైఎస్ జగన్ తదితర అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆలోచించాలి. చంద్రబాబుతో వచ్చిన చిక్కు ఏంటంటే… రాజకీయాల్లో అన్ని రకాల అవలక్షణాల్ని పెంచిపోషిస్తూ, ఇతర రంగాలన్నీ బాగుండాలని నీతులు చెబుతుంటారు.
పార్టీ ఫిరాయింపులు, ప్రత్యర్థి పార్టీల తరపున గెలిచిన వాళ్లకు కేబినెట్లో చోటు కల్పించడం, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అరాచకాలు… ఇవన్నీ రాజకీయ కాలుష్యానికి ఉదాహరణలే. అయితే తమ వరకూ వచ్చే సరికి… ఏ నియమాలు, నిబంధనలు వర్తించవని నాయకులు తమ చర్యల ద్వారా సంకేతాలు ఇస్తుంటారు. ఇందుకు చంద్రబాబుతో సహా ఏ ఒక్కరూ అతీతులు కారు.
Social Plugin